News

కోహ్లీ సేనకు కొత్త మేనేజర్‌!


భారత క్రికెట్‌ జట్టుకు కొత్త పరిపాలన మేనేజర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా మేనేజర్‌ని మార్చాల్సిన అవసరం ఏమిటి... ఒక్కసారిగా ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందనేది ప్రతి ఒక్క అభిమాని మదిలో మెలిగే ప్రశ్న. ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం ప్రస్తుత జట్టు పరిపాలన మేనేజర్‌ కపిల్‌ మల్హోత్ర సమర్పించిన నివేదికే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అతను సమర్పించిన నివేదికే అతని జాబ్‌కి ఎసరు తెచ్చిపెట్టింది. సాధారణంగా స్వదేశంలో కానీ, విదేశంలో కానీ భారత జట్టు ఏ టోర్నీ ఆడినా.. సదరు టోర్నీ ముగిసిన అనంతరం జట్టు మేనేజర్‌ బోర్డు(బీసీసీఐ)కి రిపోర్టు అందించాలి. తాజాగా ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం భారత జట్టు పరిపాలన మేనేజర్‌ కపిల్‌ మల్హోత్రా అందించిన నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఫైనల్లో భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌ చేతిలో ఓడిపోవడం, టోర్నీ అనంతరం కోచ్‌ పదవికి అనిల్‌కుంబ్లే రాజీనామా చేయడం. ఈ రెండు అంశాల గురించి కపిల్‌... నివేదికలో ఏమని పేర్కొంటాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, అతను మాత్రం కోహ్లీ-కుంబ్లే సంబంధాలపై తీవ్రమైన అభిప్రాయాలేమీ వ్యక్తం చేయలేదు. కోహ్లీకి ప్రతికూలమైన అంశాలేమీ పొందుపరచలేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీ జరిగిన సమయంలో కోహ్లీ-కుంబ్లే పెద్దగా మాట్లాడుకోలేదని, ఇరువురి మధ్య ఎలాంటి గొడవ చోటు చేసుకోవడం తాను చూడలేదు అని మాత్రమే పేర్కొన్నాడు. కపిల్‌ నివేదికను చూసి ఆశ్చర్యపోయిన బీసీసీఐ భారత జట్టుకి ప్రొఫెషనల్‌ మేనేజర్‌ను ఎంపిక చేయలన్న ఆలోచనలో పడింది. దీనిపై అంతర్గతంగా భారీ చర్చలే జరుగుతున్నాయి. వారం లేదా రెండు వారాల్లో దీనిపై బీసీసీఐ స్వచ్ఛందంగా ప్రకటన చేయనుంది.